Friday, August 29, 2008

తెలుగు భాషాదినోత్సవం!

తెలుగుభాష అంటే అపారమైన అభిమానం, అఖండమైన పాండిత్యం మూర్తీభవించిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులుగారు. భాషమీదున్న అభిమానంతో దానికోసం ఒక వ్యక్తి తన జీవితాన్నే ధారపోసాడన్న విషయం తలచుకొన్నప్పుడల్లా ఒక ఆశ్చర్యం, ఒక పులకింత! ఈ
రోజు అతని పుట్టినరోజుని మనం తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం, స్ఫూర్తిదాయకం. గిడుగువారు వ్యావహారిక భాషా వ్యాప్తికి చేసిన కృషి అనన్య సామాన్యమైనది. అతని గురించి తెలుసుకోవడం ప్రతి తెలుగువాడి కర్తవ్యం.

19వ శతాబ్దానికి పూర్వం తెలుగుసాహిత్యంలో పద్య కావ్యాలే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. వచన సాహిత్యం, ఇతర శాస్త్రాలకి సంబంధించిన వచన గ్రంధాలూ ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందలేదు. పందొమ్మిదవ శతాబ్దంలో, మారుతున్న సాంఘిక పరిస్థితులూ, పాశ్చాత్యులతో సంబంధాలూ, అచ్చు యంత్రం అందుబాటులోకి రావడం మొదలైన అనేక కారణాల వల్ల సాహిత్యంలో కొత్త ప్రక్రియలకు వ్యాప్తి వచ్చింది. ఈ నేపథ్యంలో, విస్తృతి చెందుతున్న యీ సాహిత్య, సాహిత్యేతర గ్రంధాలలో వాడే భాష గురించి ఆలోచన మొదలయ్యింది. గ్రాంధికభాషా వాదులు (అప్పట్లో చాలామంది పండితులు), మన కావ్యాలలో ఉన్న భాషనే వ్యాకరణ బద్ధం చేసి, దానినే అన్ని రకాల రచనలకీ వాడలని సంకల్పించారు, పట్టుబట్టారు. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళలో ముఖ్యులు గిడుగు రామ్మూర్తిగారు. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికీ, వచన రచనకీ కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన "శిష్టవ్యావహారిక" భాషనే వాడాలనీ, గ్రాంధికవాదులతో అవిశ్రాంతంగా, హోరాహోరి యుద్ధం చేసారు. తన ఆశయసాధన కోసం బతుకంతా శ్రమించారు.
గిడుగువారిలో నాకన్నిటికన్నా నచ్చే విసయం ఏవిటంటే, అతను వట్టి గాలికబుర్లు చెప్పలేదు. ఉత్తుత్తి వాదనలు చెయ్యలేదు. తెలుగు సాహిత్యాన్నంతటినీ క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి, ప్రాచీన సాహిత్యంలో ఉన్న వచన రచనలు ఏ రకంగా అప్పటి వాడుకభాషకి దగ్గరగా ఉన్నాయో, కావ్యాలలో కూడా వ్యాకరణానికి లొంగని ప్రయోగాలెన్ని ఉన్నాయో నిరూపించి చూపించారు.
ఊరూరా తిరిగి, సభలు జరిపి, పండితులతో చర్చలు చేసి, వ్యావహారిక భాషా ప్రయోజనాన్ని ప్రచారం చేసారు.
చెప్పిన దాన్ని సశాస్త్రీయంగా చెప్పడం ఇతని గొప్పతనం. పండితులైన ఎందరో గ్రాంధికభాషా వాదులు ఇతని ప్రతిభకి ముగ్ధులై అతన్ని గౌరవించారు. తమ ఆలోచనలని కూడా మార్చుకున్నారు. ఇతరులు చెప్పేదాని గురించి ఆలోచించి, అందులో మంచిని గ్రహించడమే కదా గొప్పవాళ్ళ లక్షణం!
అతన్ని గౌరవించిన వారిలో తిరుపతి వేంకట కవులు ప్రముఖులు. తమ దోవని మార్చుకున్నవారిలో ప్రముఖులు కందుకూరి వీరేశలింగం, తాపీ ధర్మారావు.
గిడుగువారు సవరభాషమీద కూడా ఎంతో పరిశోధన చేసారు. సవరభాషకి నిఘంటువు వ్యాకరణం సమకూర్చారు. సవరల విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసారు.
గిడుగువారి వ్యక్తిత్వంలో మరి కొన్ని అంశాలు - అతని పట్టుదల దృఢ దీక్ష, ముక్కుసూటి నడవడిక, సాంఘిక సంస్కరణాభిలాష, ఆంధ్ర దేశాభిమానం.
అతని వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం!

గిడుగువారి గురించి భద్రిరాజుగారి పరిచయం ఇక్కడ చదవొచ్చు:
గిడుగు వెంకట రామమూర్తి - రేఖాచిత్రం (1863 - 1940)

గిడుగువారు రాసిన కొన్ని వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు:
ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక

పూర్తిగా చదవండి...

Monday, August 18, 2008

మనలని అంతర్లీనంగా కలిపే సూత్రం ఏది?

మొన్న బ్లాగాడించే రవిగారు "దేశభక్తి అంటే ఏమిటి?" అని చురుగ్గా ఓ ప్రశ్న వేసారు, స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా. అయితే అందులో, అదేవిటో తెలుసుకొనే ఆలోచనలకన్నా, అది శుద్ధ దండుగమారి ఆవేశమేనా అనే ఒక భావన లీలగా కనిపించింది. దానికి నేనక్కడ నాకు తోచిన నాలుగుముక్కలు కామెంటేను. కానీ అసలు ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. "దేశభక్తి అంటే ఏమిటి?"

దేశభక్తి అనగానే నాకు తెలుగులో రెండు గొప్ప గీతాలు, రెండూ దేశభక్తి గీతాలే, గుర్తుకొస్తాయి. ఒకటి గురజాడ "దేశమును ప్రేమించుమన్నా", మరొకటి దేవులపల్లి "జయ జయ ప్రియభారత జనయిత్రి". ఈ రెంటినీ ఒకే దేశభక్తి కవిత్వపు గాటకి కట్టేసే విమర్శకాగ్రేసరులున్నారు. కానీ అది సరికాదు. గురజాడది అభ్యుదయంతో కూడిన దేశభక్తి అయితే, దేవులపల్లిది కాల్పనిక భావావేశంతో కూడుకొన్న దేశభక్తి. నన్నడిగితే ఈ రెండూ మనకి అవసరమే! ఒకటి స్ఫూర్తినిస్తే మరొకటి కార్య నిర్దేశం చేస్తుంది.
"దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్!" అని చాలా స్పష్టంగా దేశభక్తిని నిర్వచించాడు గురజాడ. కేవలం భౌగోళికమైన సరిహద్దుల (Geographical boundaries) దృష్ట్యా మనం మన దేశమ్మీద అభిమానం పెంచుకోవడం నిరర్ధకం. అది కృతకమైన దేశభక్తి. "మనది" అనే ఒక భావన మన దేశప్రజలనందరినీ కలిపితే, దాని ద్వారా మనకి మనవాళ్ళపైన కలిగే ప్రేమా అభిమానం నిజమైన దేశభక్తి అని నా ఉద్దేశం. ఆ "మనది" అనే భావన ఎక్కడనుంచి వస్తుంది? మనలని అంతర్లీనంగా కలిపే ఆ సూత్రం ఏది? ఈ ప్రశ్నలకి నాకు తోచిన జవాబు భారతీయమైన సంస్కృతి. దేశభక్తి అనే కన్నా జాతీయత దీనికి సరైన పదం అనుకుంటా.

ఇంతకీ ఈ సోదంతా ఇక్కడెందుకు రాస్తున్నాను? ఆ మధ్య చర్చల్లో కత్తి మహేష్ గారన్నారు, తెలుగు సంస్కృతి మారిపోతూ ఉంటే దానికనుగుణంగానే తెలుగుభాష మారుతోంది. కాబట్టి తెలుగుభాషని మాత్రమే ఉద్ధరిద్దామనుకుంటే అయ్యే పని కాదూ అని. సంస్కృతీ భాషల మధ్య సంబంధం గురించి వారన్నది ముమ్మాటికీ నిజమే. అందుకే భాష గురించి ఆలోచించేటప్పుడు సంస్కృతిగురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనిపించింది.
సంస్కృతి అంటే పండగలూ పబ్బాలూ, పూజలూ పునస్కారాలే కాదు. సంస్కృతి అంటే మనదైన జీవన విధానం, విలువలు, దృక్పథం. ఇవన్నీ మనకంటూ ప్రత్యేకంగా ఉన్నాయి. వీటిని మనం కోల్పోతున్నాం. ఇప్పుడు అనిపించకపోయినా, కాలం మనకి దీని ప్రాముఖ్యాన్ని గుర్తుచెయ్యక మానదు. మన అస్తిత్వం ఏవిటి, మనం ఎవరం అనే ప్రశ్న, ఒక జాతిగా మన తెలుగువాళ్ళం, మన భారతీయులం వేసుకోవాల్సిన పరిస్థితి ఎప్పటికైనా వస్తుంది. అప్పుడు మనల్ని మనం సాంస్కృతికంగా పునరావలోకనం చేసుకొని, మనది అన్నదాన్ని స్థాపించుకొని, పునరుజ్జీవులం కావల్సిన అగత్యం ఏరపడుతుంది. సాంస్కృతిక పునరుజ్జీవనం (Cultural Renaissance) అంటే వెయ్యేళ్ళు వెనక్కి వెళ్ళడం కాదు. పాతనంతా మళ్ళీ నెత్తికెత్తుకోవడమూ కాదు. మన మూలాలని మనం స్పష్టంగా తెలుసుకొని, దాని ఆధారంగా మనకే స్వంతమైన ఒక కొత్త సంస్కృతిని సృష్టించుకోవడం.

మన భారతీయ సంస్కృతిలో నాకు కనిపించే, మనం నిలబెట్టుకోవాలనిపించే, మౌలిక లక్షణాలు నాలుగు:

1. శ్రామికత - శారీరికమైన శ్రమకి మన సంస్కృతి విలువనిస్తుంది. శారీరక సౌఖ్యమే ప్రధానమనే భావన మనది కాదు. మానసిక ఆనందం మనకి ముఖ్యం. కానీ ఇప్పుడు శారీరిక సుఖమే పరమావధి అనే భావానికి మనం లొంగిపోతున్నాం. నడక దూరంలో ఉన్నదానికైనా మోటారు బళ్ళమీదే వెళుతూ, ఆరోగ్యంకోసం ప్రత్యేకంగా ముక్కుతూ మూలుగుతూ "morning walk" చేసే పరిస్థితి ఎవరికీ హాస్యాస్పదం అనిపించటం లేదు! మానసిక"అవసరాలు" "లగ్జరీ"లవుతున్నాయి. శారీరకంగా కష్టపడుతున్నా, మానసికంగా సంతృప్తితో ఆనందంతో ఉండేవాళ్ళని చూసి, వాళ్ళ ఆనందం వట్టి భ్రమ అని ఈసడించుకొనే ఒక విపరీత ధోరణి మనకి అలవాటవుతోంది. దీన్నుంచి బయటపడాలి.

2. ప్రకృతితో చెలిమి - ప్రకృతితో అతి సన్నిహితంగా జీవితాన్ని గడపడం మన సంస్కృతిలో ఒక ముఖ్యభాగం. మన వేషభాషలూ, ఆహారవ్యవహారాలూ, ఆచారాలూ అన్నీ ప్రకృతితో ముడిపడ్డవే. దీనికీ మనం దూరమైపోతున్నాం.

3. ధార్మికత - మన దేశంలో మూఢాచారాలూ, దురాచారాలూ ఉండిన మాట వాస్తవమే. వాటిని నిర్మూలించుకోవడం చాలా అవసరమేనూ. కానీ, వాటిని మనం భూతద్దంలో చూస్తూ, మన సంస్కృతి అంటే ఆ దురాచారాలు తప్పిస్తే మరేమీ లేదూ అనుకోవడానికి అలవాటుపడుతున్నాం. అది చాలా దురదృష్టకరం. మనిషిని మనిషి ప్రేమించాలని చెప్పే మానవత్వం, ఇతరులకి ఉపకారం చెయ్యాలని ప్రబోధించే నీతి ధర్మ సూత్రాలెన్నో మన సంస్కృతిలో అంతర్భాగమై, మన భారతీయుల జీవితాలని నడిపించాయి. కేవల వ్యాపారాత్మక దృష్టి ప్రబలి మనమీ మౌలిక సూత్రానికి దూరమవుతున్నాం.

4. గ్రహణ/సహన శక్తి - ఇంగ్లీషులో దీన్ని "Open mind and Tolerance" అని అనవచ్చు. ఇందులో భారతీయులకి మించినవాళ్ళే లేరేమొ! ఇది మన బలహీనతకాదు, శక్తి అని మనం గుర్తించాలి.

మన సంస్కృతిలో భాగం కానిదీ, మనం పాశ్చాత్యులనుండి నేర్చుకోవలసిందీ వైజ్ఞానికత (వైజ్ఞానిక దృష్టి). ఈ అయిదింటి కలయికతో మనదైన సంస్కృతిని మనం సృష్టించుకోవాలి. అలా చేసినప్పుడు మనకంటూ ఒక విశిష్టమైన అస్తిత్వాన్ని ఏర్పరచుకోగలుగుతాం. ప్రపంచానికీ, మానవజాతికీ మనదంటూ ఒక ప్రత్యేకమైన contribution (దీనికి సరైన తెలుగుపదం నాకు తట్టడం లేదు) ఇచ్చినవాళ్ళమవుతాం.
"నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవించానూ" అని గర్వంగా పాడుకోగలుగుతాం!

పూర్తిగా చదవండి...

Wednesday, August 13, 2008

నేనెరిగిన తెలుగుదనం

ఎఱ్ఱంచు పంచెకట్టూ, పైన లాల్చీ, నుదుటన నిలువుగా తీర్చిన తిలకంతో పక్కన నడుస్తున్న తాతగారు, తన స్వగతాలని వినిపిస్తూంటే వింటూ, చెఱకు చేలమ్మటా, జీడితోటల్లోనూ తిరగడం...
తేగలు కాల్చుకు తినడం, తాటికాయలు చేతివేళ్ళతో జుఱ్ఱుకోడం, నవనవలాడే పనసకాయలు చిన్నాన్నలు కసకసకసా కొట్టి చేసిన సన్నని పొట్టుతో తయారైన పనసపొట్టు కూర వాసనా రుచీ ఒకేసారి తలకెక్కడం...ఇలా ఎన్నో...
చిన్నప్పుడు, అప్పుడప్పుడు, వేసవి సెలవల్లో అందీ అందక నాకందిన తెలుగుదనం!

నాన్న వినిపించిన రాయబారప్పద్యాలూ, అమ్మ నేర్పిన తెలుగు పాఠాలు, అమ్మమ్మ వల్లెవేయించిన శ్లోకాలూ, తాతతో కలిసి నింపిన "బాలజ్యోతి", "వనిత" గళ్ళ నుడికట్లూ...
మూడుకోవిళ్ళలోనో, గుంచీలోనో జరిగే హరికథలకి వెళ్ళడం, ఇంట్లో ఉన్న పాత చిడతలని పట్టుకొని పెద్ద హరిదాసులా "గజేంద్రమోక్షం" హరికథ వచ్చీరాని భాషలో చెప్పి అందరినీ మురిపించడం, వినాయకచవితి ఉదయాన్నే లేచి పత్రికోసం వేటా, భోగీ వచ్చిందంటే పెరట్లో ఏ చెట్టుకొమ్మల్ని విరపాలో, ఏ పాత కుర్చీలకి ఉద్వాసన చేప్పాలో పెద్దవాళ్ళతో గొడవా, దీపావళికి జువ్వల యుద్ధాలూ...ఇలా ఎన్నెన్నో...
పెద్దవుతూ నే ననుభవించిన తెలుగుదనం!

తెలుగు నేలమీద, తెలుగువాళ్ళ మధ్యలో, తెలుగు మాట్లాడుతూ, తెలుగువాడిలా బతికే ఆనందం...
నాకు దూరమైన తెలుగుదనం!

మీగడ అద్దుకు తినే ఆవకాయన్నం, ఉల్లిపాయి నంచుకుతినే గోంగూరా కందిగుండా, వెల్లుల్లితో ఘుమ్మెత్తించే పాఠోళీ, నిమ్మకాయ జల్లుకొని మధ్య మధ్య పచ్చిమిరపకాయ కొరుక్కుంటూ తినే పసందైన పెసరపప్పూ...
ఇంకా నా జీవితంలో (మా ఆవిడ ధర్మవా అని) మిగిలున్న తెలుగుదనం!

"నాన్నా, పులి అంటే లయనా టైగరా?"
నేను జీర్ణించుకోలేకపోతున్న తెలుగుదనం :-(

పూర్తిగా చదవండి...

Friday, August 01, 2008

మనకెప్పుడీ మంచి రోజులు?

Effective expression possible only in mother tongue

మన మంత్రులెవరైనా ఈ మధ్యకాలంలో ఇలా మాట్లాడారా? ఎందుకు లేదు? దానికెవరు బాధ్యులు?
మనం మన తమిళ తముళ్ళనించి ఎందుకు నేర్చుకోకూడదు? వాళ్ళది అహంకారమని కొట్టిపారేస్తే అది మనకి సంతృప్తి. ఆత్మగౌరవానికీ, అహంకారానికీ మధ్యనున్న గీత సన్ననిదే. కానీ ఆత్మగౌరవానికీ, ఆత్మన్యూనతకీ మధ్యనున్న గీత చాలా లావైనదే కదా! నిజానికి మనని మనం తక్కువచేసుకోడం ఒక ఫేషనయిపోయింది. తెలుగువాడు తలచుకుంటే చెయ్యలేనిది లేదు. ఎటొచ్చీ అంతా ఆ తలచుకోడంలోనే ఉంది!
అంతర్లీనంగా మనకి మనమీద చాలా అభిమానమే ఉంది. అంతర్జాలంలో ఇన్ని తెలుగు బ్లాగులు ఇంతగా నడుస్తున్నాయంటే, దానికి కారణం మరేమిటి?
అంతర్జాలంలో ఇంతమందికున్న ఈ తెలుగు భాషాభిమానాన్ని మనం మన రాష్ట్రంలో ప్రజలదగ్గరకి ఎందుకు తీసుకువెళ్ళ కూడాదూ అన్నారు, ఈ మధ్యనే ఒక బ్లాగ్మిత్రుడు.
అది చాలా మంచి ఆలోచన. మరి మీరేమంటారు?
పూర్తిగా చదవండి...