Friday, August 29, 2008

తెలుగు భాషాదినోత్సవం!

తెలుగుభాష అంటే అపారమైన అభిమానం, అఖండమైన పాండిత్యం మూర్తీభవించిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులుగారు. భాషమీదున్న అభిమానంతో దానికోసం ఒక వ్యక్తి తన జీవితాన్నే ధారపోసాడన్న విషయం తలచుకొన్నప్పుడల్లా ఒక ఆశ్చర్యం, ఒక పులకింత! ఈ
రోజు అతని పుట్టినరోజుని మనం తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం, స్ఫూర్తిదాయకం. గిడుగువారు వ్యావహారిక భాషా వ్యాప్తికి చేసిన కృషి అనన్య సామాన్యమైనది. అతని గురించి తెలుసుకోవడం ప్రతి తెలుగువాడి కర్తవ్యం.

19వ శతాబ్దానికి పూర్వం తెలుగుసాహిత్యంలో పద్య కావ్యాలే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. వచన సాహిత్యం, ఇతర శాస్త్రాలకి సంబంధించిన వచన గ్రంధాలూ ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందలేదు. పందొమ్మిదవ శతాబ్దంలో, మారుతున్న సాంఘిక పరిస్థితులూ, పాశ్చాత్యులతో సంబంధాలూ, అచ్చు యంత్రం అందుబాటులోకి రావడం మొదలైన అనేక కారణాల వల్ల సాహిత్యంలో కొత్త ప్రక్రియలకు వ్యాప్తి వచ్చింది. ఈ నేపథ్యంలో, విస్తృతి చెందుతున్న యీ సాహిత్య, సాహిత్యేతర గ్రంధాలలో వాడే భాష గురించి ఆలోచన మొదలయ్యింది. గ్రాంధికభాషా వాదులు (అప్పట్లో చాలామంది పండితులు), మన కావ్యాలలో ఉన్న భాషనే వ్యాకరణ బద్ధం చేసి, దానినే అన్ని రకాల రచనలకీ వాడలని సంకల్పించారు, పట్టుబట్టారు. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళలో ముఖ్యులు గిడుగు రామ్మూర్తిగారు. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికీ, వచన రచనకీ కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన "శిష్టవ్యావహారిక" భాషనే వాడాలనీ, గ్రాంధికవాదులతో అవిశ్రాంతంగా, హోరాహోరి యుద్ధం చేసారు. తన ఆశయసాధన కోసం బతుకంతా శ్రమించారు.
గిడుగువారిలో నాకన్నిటికన్నా నచ్చే విసయం ఏవిటంటే, అతను వట్టి గాలికబుర్లు చెప్పలేదు. ఉత్తుత్తి వాదనలు చెయ్యలేదు. తెలుగు సాహిత్యాన్నంతటినీ క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి, ప్రాచీన సాహిత్యంలో ఉన్న వచన రచనలు ఏ రకంగా అప్పటి వాడుకభాషకి దగ్గరగా ఉన్నాయో, కావ్యాలలో కూడా వ్యాకరణానికి లొంగని ప్రయోగాలెన్ని ఉన్నాయో నిరూపించి చూపించారు.
ఊరూరా తిరిగి, సభలు జరిపి, పండితులతో చర్చలు చేసి, వ్యావహారిక భాషా ప్రయోజనాన్ని ప్రచారం చేసారు.
చెప్పిన దాన్ని సశాస్త్రీయంగా చెప్పడం ఇతని గొప్పతనం. పండితులైన ఎందరో గ్రాంధికభాషా వాదులు ఇతని ప్రతిభకి ముగ్ధులై అతన్ని గౌరవించారు. తమ ఆలోచనలని కూడా మార్చుకున్నారు. ఇతరులు చెప్పేదాని గురించి ఆలోచించి, అందులో మంచిని గ్రహించడమే కదా గొప్పవాళ్ళ లక్షణం!
అతన్ని గౌరవించిన వారిలో తిరుపతి వేంకట కవులు ప్రముఖులు. తమ దోవని మార్చుకున్నవారిలో ప్రముఖులు కందుకూరి వీరేశలింగం, తాపీ ధర్మారావు.
గిడుగువారు సవరభాషమీద కూడా ఎంతో పరిశోధన చేసారు. సవరభాషకి నిఘంటువు వ్యాకరణం సమకూర్చారు. సవరల విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసారు.
గిడుగువారి వ్యక్తిత్వంలో మరి కొన్ని అంశాలు - అతని పట్టుదల దృఢ దీక్ష, ముక్కుసూటి నడవడిక, సాంఘిక సంస్కరణాభిలాష, ఆంధ్ర దేశాభిమానం.
అతని వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం!

గిడుగువారి గురించి భద్రిరాజుగారి పరిచయం ఇక్కడ చదవొచ్చు:
గిడుగు వెంకట రామమూర్తి - రేఖాచిత్రం (1863 - 1940)

గిడుగువారు రాసిన కొన్ని వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు:
ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక

2 comments:

కొత్త పాళీ said...

Excellent and timely!

రవి said...

చాలా మంచి పరిచయం. నెనర్లు.